హైదరాబాద్‌కు దిగ్గజ సంస్థ….క్వాల్కమ్

112
ts
- Advertisement -

సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్‌ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అమెరికాలోని శాండియాగోలో క్వాలమ్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాశ్‌ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్‌జిన్‌, లక్ష్మీ రాయపూడి, పరాగ్‌ అగాసే, డైరెక్టర్‌ దేవ్‌సింగ్‌ తదితర కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.హైదరాబాద్‌ నగరంలో వివిధ దశల్లో రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపిన క్వాలమ్‌.. మంత్రి కేటీఆర్‌తో తన పెట్టుబడి ప్రణాళికను పంచుకున్నది. వచ్చే ఐదేండ్లలో తమ సంస్థ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సుమారు 15 లక్షల 72 వేల చదరపు అడుగుల వైశాల్యంగల కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్‌ నాటికి హైదరాబాద్‌లో తమ కేంద్రం సిద్ధమవుతుందని తెలిపింది.

ఇప్పటికే పలు టెక్‌ దిగ్గజాలు ప్రపంచంలోనే అతి పెద్ద రెండో క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విషయాన్ని తెలిపిన కేటీఆర్‌, ఈ వరుసలో క్వాలమ్‌ చేరడంపై హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాలమ్‌ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు వ్యవసాయ, విద్యారంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్రిటెక్‌, విద్యారంగం, కనెక్టెడ్‌ డివైజ్‌ వినియోగం, స్మార్ట్‌సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు.

ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) రంగంలో ప్రముఖ కంపెనీ ఫిసర్‌ హైదరాబాద్‌లో ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. లాస్‌ఏంజెల్స్‌లోని ఫిస్కర్‌ కార్యాలయంలో సీఈవో హెన్రీక్‌ ఫిస్కర్‌, సీఎఫ్‌వో గీతా ఫిసర్‌లతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతున్నదని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని వివరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారవుతున్నాయని, జడ్‌ఎఫ్‌, హ్యుండాయ్‌ కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా టెక్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రాధాన్యరంగంగా గుర్తించి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఆటోమొబైల్‌ పరిశ్రమకు సంబంధించి డిజైన్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్‌లో అద్భుత అవకాశాలున్నాయని, ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ని ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిసర్‌ కంపెనీని కోరారు. మంత్రి కేటీఆర్‌ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిసర్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేస్తూ, మొబిలిటీ క్లస్టర్‌లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు.

- Advertisement -