కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్‌డౌన్‌..

143
- Advertisement -

కరోనా మహమ్మారి రోజురోజుకు దేశవ్యాప్తంగా పెరిగిపోతుంది. కరోనా కట్టడికి పలు రాష్టాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇందలో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఒడిశాలోనూ రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వమూ లాక్ డౌన్ ను విధించింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 8,015 కొత్త కేసులు నమోదవగా, 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,62,622కు పెరిగింది. మొత్తంగా 2,068 మంది చనిపోయారు.

ఈ నేపథ్యంలో ఒడిశా సర్కారు కరోనా నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి 19 వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ప్రజలు బయటకు రావొద్దని సర్కారు సూచించింది. ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ పెడుతున్నట్టు స్పష్టం చేసింది. నిత్యవసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతినిచ్చింది. అయితే, దానికి ఓ షరతు పెట్టింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే ఏది కావాలన్నా కొనుగోలు చేయాలని సూచించింది. అది కూడా అర కిలోమీటరు దూరంలోపున్న షాపులు లేదా కూరగాయల దుకాణాలకే నడుచుకుంటూ వెళ్లాలని తెలిపింది. వైద్య సేవలు, నిత్యావసర సేవలు అందించే వాహనాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని పేర్కొంది.

- Advertisement -