మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా నిజమేనని మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. 6 పేజీల నివేదిక ను సీఎస్ సోమేశ్ కుమార్ పంపిన మెదక్ కలెక్టర్ హరీష్.… రోడ్ వైండింగ్ లో భాగంగా చాలా చెట్లను నరికివేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
అచ్చంపేటలోని సర్వే నంబర్ 130లో 15.35 ఎకరాలు, సర్వే నంబర్ 111లో 7.15 ఎకరాలు, సర్వే నెంబర్ 81లో 9.18 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తేలింది. పలువురు అధికారులతో కూడిన మరో రెవెన్యూ బృందం రికార్డులను పరిశీలించింది. ఈ విచారణలో మొత్తం 65 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని, అందులో హ్యాచరీస్ కట్టారని తెలిసింది.
ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్ శుక్రవారం సీఎస్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, విజిలెన్స్ ఎస్పీ మనోహర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ శనివారం మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పర్యటించింది. సుమారు పది గంటలకు పైగా అధికారులు దర్యాప్తు కొనసాగించారు. బాధిత రైతుల నుంచి వివరాలను సేకరించారు. రైతుల వద్ద ఉన్న హక్కు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.