ఐటీ, పుర పాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ లోని తమ నివాసంలో తమ కుటుంబ సభ్యులు, మనవరాళ్ళతో కలిసి పారిశుద్ధ్య పనులు చేశారు.
ఇంట్లో చెట్ల పాదుల్లోని చెత్తను ఏరివేశారు. అలాగే, ఇంట్లో నీటి నిలువలు లేకుండా చేశారు. నీటి నిలువలున్నచోట్ల నీటిని తీసేసి, వాటిని పరిశుభ్ర పరచి, మూతలు ఉండేలా చేశారు. చెత్తా చెదారం తీసేసి దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..కేటీఆర్ ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు, పది నిమిషాలు కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలన్నారు.
దోమల నివారణతో మలేరియా, డెంగీ వంటి అనేక వ్యాధులను రాకుండా నివారించవచ్చన్నారు. మన ఇంటితోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ రహితంగా ఉంచడమే గాక, ఆరోగ్యంగా ఉంచవచ్చన్నారు.
నగర, గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. కేవలం విఐపిలకే కాకుండా, ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పచ్చదనం-పరిశుభ్రత, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్ఛ హైదరాబాద్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.