ప్రతి గింజకు మద్ధతు ధర- మంత్రి హరీష్

186
- Advertisement -

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని వరదరాజ్ పూర్, గజ్వేల్ మండలంలోని సిమెగాటం గ్రామాల్లో వరి ధాన్య, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఏం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గింజకు మద్ధతు ధర అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి గింజకు మద్ధతు ధర అందించేలా రాష్ట్రంలో 7 వేల వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించాం. మండుటెండల్ని లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించింది. రైతు శ్రేయోభిలాషి, రైతుబిడ్డగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, కాబట్టే ఇదంతా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో వరి పంట వస్తోందని, ఎక్కడా చూసినా ధాన్యపు రాశులు కనపడుతున్నాయని మంత్రి వెల్లడించారు.

minister harish

కష్టపడ్డ ప్రతి రైతుకు తగిన ఫలితం దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా 7వేల ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎక్కడా రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ముందు జాగ్రత్తలు ప్రభుత్వం చేపట్టింది. రైతు నష్టపోవద్దు, రైతులకు తగిన మద్ధతు ధర ఇవ్వాలని ప్రతి క్వింటాలుకు 1835/- రూపాయల మద్ధతు ధరను వరి పంటకు ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. టోకెన్లు లేకుండా రైతులు ధాన్యాన్ని కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకురావొద్దు. వరి పంట కోసిన తర్వాత బాగా ఆరబెట్టి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకురావాలి.

ప్రతి రేషన్ కార్డుపై సీఏం కేసీఆర్ రూ.1500 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేశారని, తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇబ్బందులు ఉండొద్దని 13 వందల 14 కోట్ల రూపాయలను లబ్ధిదారుల కోసం ప్రతి రేషన్ కార్డుపై 1500 రూపాయలను బ్యాంకుల్లో జమ చేశాం. బ్యాంకుల్లో జమ చేసిన 1500 రూపాయల డబ్బులు ఎటుపోవని, అనవసర పుకార్లు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దు. అత్యవసరంగా నిత్యావసర సరుకులు లేకుండా ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

harish rao

బ్యాంకుల వద్ద ప్రజలంతా గుమిగూడొద్దని, కరోనా కోసం ఇన్ని రోజులు చేసిన కృషిని వృథా చేయొద్దని ప్రజలను మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, మండలాల ఏంపీడీఓలకు మంత్రి ఆదేశించారు. ఆకలితో ఉన్న వారు ఉపాధి పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేదు.

రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మిన వారం రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తుంది. రైతుకు మేలు జరిగేలా నిర్ణయాన్ని రైతులే చేపట్టాలి. రేపో, మాపో కాళేశ్వరం నీళ్లు తెచ్చి సింగాటం చెరువులు, కుంటలు నింపే శుభఘడియలు దగ్గరికొచ్చాయి. గోదావరి జలాలు వచ్చాక.. సిద్ధిపేట జిల్లా హరిత జిల్లాగా మారుతుంది. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం గజ్వేల్, 600 మీటర్ల ఎత్తైన ఈ గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలు తేవడం కేవలం సీఏం కేసీఆర్ తోనే సాధ్యమైంది.

vanteru prathap

దేవుని దయవల్ల మన సిద్ధిపేట జిల్లాలో ఒక్కటే కరోనా కేసు నమోదైంది. కరోనాకు మందులేదు.. ఎవరి ఇంట్లో వారు ఉండటమే కరోనాను అసలైన మందు. వేడి నీళ్ల ఆవిరి, గోరు వెచ్చని నీళ్లు తాగితే.. గొంతు వద్దనే కరోనాను ఆరికట్టవచ్చు.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంలో నియోజకవర్గంతో పాటు జిల్లాలోనే మర్కుక్ మండలం ఆదర్శ మండలంగా ఫస్ట్ నిలిచిందని ఆ మండల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.

కరోనా కట్టడి, లాక్ డౌన్ నేపథ్యంలో మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రజలు రోడ్ల మీదకు రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, స్థానిక ఎస్ఐ, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజలకు మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -