సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అరుదైన ఘనత..

597
Singareni thermal power plant
- Advertisement -

సింగరేణి కాలరీస్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నడుస్తున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మరోసారి తన ప్రతిభ చాటుకొంది. ఫిబ్రవరి (2020) నెలలో స్టేషన్‌లో గల రెండు యూనిట్లు నూరుశాతం పైబడి పి.ఎల్‌.ఎఫ్‌. (ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించాయి. దీంతో స్టేషన్‌ పి.ఎల్‌.ఎఫ్‌. 100.18 శాతంగా నమోదైంది.

ఫిబ్రవరి నెలలో ఈ ప్లాంటు 836.70 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగా దీనిలో ప్లాంటుకు అవసరమైన విద్యుత్తు పోను మిగిలిన 791.79 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 8,398 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా 7,895 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును తెలంగాణా రాష్ట్ర అవసరాలకు అందించడం జరిగింది.

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండు యూనిట్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించడంపై సంస్థ సి ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ తన హర్షం ప్రకటిస్తూ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే ఒరవడి కొనసాగించాలన్నారు.

గత రెండేళ్లలో 3 సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించిన ఎస్‌.టి.పి.పి.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం గత రెండేళ్ల కాలంలో 3 సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా మంచిపేరు తెచ్చుకొంది. 2018 సెప్టెంబర్‌ లో 100.04 శాతం, 2019 ఫిబ్రవరిలో 100.05 శాతం స్టేషన్‌ పి.ఎల్‌.ఎఫ్‌. సాధించగా ఈ ఫిబ్రవరి నెలలో గరిష్టంగా 100.18 శాతం స్టేషన్‌ పి.ఎల్‌.ఎఫ్‌. సాధించి తన ప్రతిభ చాటుకొంది. అంతేకాక సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో అత్యుత్తమ 25 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల జాబితాలో 2017-18 సంవత్సరంలో 5వ ర్యాంకును సాధించడం గమనార్హం.

2వ యూనిట్‌ 9 సార్లు, 1వ యూనిట్‌ 6 సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌.

ఇదిలా ఉంటే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గల రెండు యూనిట్లు విడివిడిగా మొత్తం మీద 15 సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించాయి. 2వ యూనిట్‌ మొత్తం మీద 9 సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించి అగ్రస్థానంలో ఉంది. 2017లో ఫిబ్రవరి, మే, నవంబర్‌ నెలల్లోనూ, 2018లో జూలై, సెప్టెంబర్‌ అక్టోబర్‌ నెలల్లోనూ, 2019లో జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ, 2020లో ఫిబ్రవరి నెలలో నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించింది.

అలాగే 1వ యూనిట్‌ కూడా ఆరు సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించింది. 2017లో ఏప్రియల్‌, డిసెంబర్‌ నెలల్లో, 2018లో సెప్టెంబర్‌, నవంబర్‌ నెలల్లోనూ, 2019లో ఫిబ్రవరిలోనూ, 2020 ఫిబ్రవరి నెలలోనూ 100 శాతం పైబడి పి.ఎల్‌.ఎఫ్‌. సాధించింది.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రారంభం నుండి (2016 సెప్టెంబర్‌) ఇప్పటి వరకూ (2020 ఫిబ్రవరి) 30,921 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగా దీనిలో 29,056 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు సరఫరా చేయడం జరిగింది.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేయించిన సంస్థ సి ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌, స్టేషన్‌ ప్రారంభం తర్వాత కూడా నెలవారీ సమీక్షలు నిర్వహిస్తూ ప్లాంటు నుండి నాణ్యత గల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూవస్తున్నారు. దీంతో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌.ను పలుమార్లు సాధించే అవకాశం ఏర్పడింది. ఇంతే కాక ఇదే ప్రాంగణంలో 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటును వేగవంతం చేయడమే కాక గత నెలలోనే సింక్రనైజ్‌ చేయడానికి ఆయన ప్రత్యేక కృషి చేశారని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అధికారులు తెలియజేశారు.

- Advertisement -