సెప్టెంబర్ 12వ తేదీన జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి నగరంలోని ప్రధాన చెరువుల్లో నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులను శుభ్రపర్చడంతో పాటు నిర్మాణంలో ఉన్న మరో మూడు నిమజ్జన కొలనులను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు మరింత కాలుష్యం బారిన పడకుండా ఉంచడంతో పాటు శుభ్రమైన నీటిలో నిమజ్జనాలు నిర్వహించడానికి జీహెచ్ఎంసీ నగరంలో ఇప్పటికే 23 వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాలను చేపట్టింది.
ఈ చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఇతర ప్రమాదకర రసాయన పదార్థాలతో తయారుచేసిన వినాయక, ఇతర విగ్రహాల నిమజ్జనాన్ని చేయడం ద్వారా కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ కాలుష్య నివారణకు చెరువుల్లో ప్రత్యేకంగా వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. బెంగళూర్ నగరంలో నిర్మించిన ఇలాంటి వినాయక నిమజ్జన కొలనులను నిర్మించారు. ఇదే మాదిరి నిమజ్జన కొలనులను గ్రేటర్ హైదరాబాద్లోని 26ప్రాంతాల్లో నిమజ్జన కొలనుల నిర్మాణాలను చేపట్టింది.
మొదటి దశలో రూ. 6.95 కోట్ల వ్యయంతో పది నిమజ్జన కొలనులను, రెండో దశలో రూ. 14.94 కోట్ల వ్యయంతో 15 ఎమర్షన్ ట్యాంక్ ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రెండో దశలో చేపట్టిన 15 ట్యాంక్ లలో 13 పూర్తికాగా మరో రెండింటి నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మూడో దశలో కోటి రూపాయల వ్యయంతో మల్కాజ్ గిరి బండ చెరువులో నిమజ్జన కొలను నిర్మాణాన్ని చేపట్టగా పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక్కో నిమజ్జన కొలనులో 5వేల విగ్రహాలు నిమజ్జనం చేసేవిధంగా నిర్మించారు.
సఫిల్ గూడలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన దానకిషోర్
ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి సర్కిల్ లోని సఫిల్ గూడ చెరువును జీహెచ్ఎంసీ కమిషనర్ సందర్శించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి గాను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల వద్ద లైటింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, చెరువుల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన నిమజ్జన కొలనులను శుభ్రం చేసి వాటిలో మంచి నీటిని నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయా చెరువులకు దారితీసే మార్గాలన్నింటికీ మరమ్మత్తులు చేపట్టడం, మౌలిక సదుపాయాల కల్పన, తాత్కాలిక టాయిలెట్లను, టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటుకు నిబంధనలను అనుసరించి టెండర్లను పిలువాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు.
పూర్తి అయిన నిమజ్జన కొలనుల వివరాలు…
1. ఊరచెరువు, కాప్రా
2. చర్లపల్లి ట్యాంక్ – చర్లపల్లి
3. అంబీర్ చెరువు – కూకట్పల్లి
4. పెద్ద చెరువు- గంగారం, శేరిలింగంపల్లి
5. వెన్నల చెరువు – జీడిమెట్ల
6. రంగధాముని కుంట – కూకట్పల్లి
7. మల్క చెరువు – రాయదుర్గ్
8. నలగండ్ల చెరువు – నలగండ్ల
9. పెద్ద చెరువు – మన్సూరాబాద్ సరూర్నగర్
10. హుస్సేన్సాగర్ లేక్, సికింద్రాబాద్
11. పెద్దచెరువు-నెక్నాంపూర్
12. లింగంచెరువు-సూరారం
13. ముళ్లకత్వచెరువు-మూసాపేట్
14. నాగోల్చెరువు
15. అల్వాల్-కొత్తచెరువు
16. నల్లచెరువు- ఉప్పల్
17. పత్తికుంట-రాజేంద్రనగర్
18. బోయిన్చెరువు-హస్మత్పేట్
19. మియాపూర్-గురునాథ్చెరువు
20. లింగంపల్లి- గోపిచెరువు
21. రాయసముద్రం చెరువు- రామచంద్రాపురం
22. హఫీజ్పేట్-కైదమ్మకుంట
23. రాయదుర్గ్ – దుర్గంచెరువు
పురోగతిలో ఉన్న నిమజ్జన కొలనులు..
1. పటాన్ చెరు లోని సాకి చెరువు
2. హుస్సేన్ సాగర్ లో అంబేడ్కర్ నగర్ వద్ద
3. మల్కాజ్ గిరిలోని బండ చెరువు