తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామానికి వెళ్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన చింతమడకలో పర్యటించనున్నారు. 2019, జులై 22వ తేదీ సోమవారం అక్కడికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.
ఈ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చింతమడకలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ లు కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 22న సీఎం కేసీఆర్ చింతమడకకు రాబోతున్నారని..అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చింతమడకతో అవినాభావ సంబంధం ఉందన్నారు.

కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు సిద్దంగా ఉన్నారు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దసరా, దీపావళి, ఉగాది పండగలు ఒకేసారి జరుగుతున్న వాతావరణం నెలకొందన్నారు. ఆయన ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా చింతమడక ప్రజలతో ఆత్మీయ, సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సన్నిహితులు, స్నేహితులు, ప్రజలతో కలిసి ఆత్మీయంగా గడపబోతున్నారు.

అలాగే వారితో కలిసి భోజనం కూడా చేస్తారని చెప్పారు. చింతమడక గ్రామ ప్రజల సమస్యలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చబోతున్నారు. ఇది కేవలం తన గ్రామస్తులతో కేసిఆర్ మమేకమయ్యే పర్యటన మాత్రమే.. ఇతరులు వచ్చి ఇబ్బంది పడవద్దన్నారు. మరికొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ సిద్దిపేటకు రాబోతున్నారు..అప్పుడు అందరికి అవకాశం వస్తుందని చెప్పారు.

