ఇండియాటూడే సౌత్ ఎంక్లేవ్ సమ్మిట్ 2018లో మంచు లక్ష్మీతో పాల్గొన్న సినీ నటుడు మోహన్ బాబు రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని ఆరోపించారు. తనకు తెలిసినంత వరకు పెద్దన్న, స్నేహితుడు ఎన్టీఆర్ ఒక్కరే నిజాయతీ కలిగిన నాయకుడనీ, లంచం అంటే ఏమిటో తెలియని మహానాయకుడని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించినప్పుడు, ఎలాంటి మచ్చలేకుండా వెనక్కి వచ్చానని తెలిపారు. సినిమాలు, రాజకీయాలు వేరన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అవన్నీ అమలు చేస్తే భారత్ ఎప్పుడో మెరుగైన స్థానంలో ఉండేదని తెలిపారు.
మీరు ఎంతో మంది సీనియర్ నటులతో నటించి ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా నటిస్తున్నారు అని అడగగా.. కుర్ర హీరోలతో నేను నటించడం ఏంటి వాళ్లే నాతో నటించారు అని కౌంటర్ వేశారు మోహన్ బాబు. తాను కేవలం సీనియర్ హీరోలతో నటించాను అని చెప్పారు. నిప్పు కాల్చేస్తుంది. నీరు ముంచేస్తుంది. గాలి లేపేస్తుంది.ఆకాశం పిడుగు వేస్తుంది.భూమి పాతేసుకుంటుంది. ప్రాణమిచ్చే పంచ భూతాలే ప్రాణం తీస్తుంటే నువ్వెంతరా అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. రజనీకాంత్ 40 ఏళ్లుగా తెలుసు. మంచి మిత్రుడు. కమల్హాసన్తో సుహృద్భావ సంబంధాలున్నాయి అని వివరించారు.