రోజుకు 600 టన్నుల ఎక్స్‌ ప్లోజివ్స్‌ సరఫరా చేయాలి..

75
- Advertisement -

సింగరేణి కాలరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా రోజుకు 14.4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీని తొలగించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ఉపరితల గనులకు అవసరమైన ఎక్స్‌ ప్లోజివ్స్‌ ను ఆటంకం లేకుండా సరఫరా చేయాలని సింగరేణి డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌), ఎన్‌.బలరామ్‌ (ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌, ఫైనాన్స్‌, పర్సనల్‌) ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీదారులు, సరఫరాదారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు కనీసం 600 టన్నుల ఎక్స్‌ ప్లోజివ్స్‌ ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై కూలంకశంగా సమీక్ష నిర్వహించాలన్న సంస్థ ఛైర్మన్‌ మరియు ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఉత్పత్తి పెంపుదలకు కీలకమైన ఎక్స్‌ ప్లోజివ్స్‌ సరఫరాపైనా గురువారం (డిసెంబర్‌ 2వ తేదీ) అడ్వైజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌.ప్రసాద్‌, జీఎం(కో ఆర్డినేషన్‌ మిరయు మార్కెటింగ్‌) కె.సూర్యనారాయణతో కలిసి డైరెక్టర్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇచ్చిన ఇండెంట్‌లో 80 శాతం మేరకు సరఫరా జరుగుతోందని, దీన్ని 100 శాతానికి పెంచాలని స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లోనే నూతన ఉపరితల గని జీడీకే ఓ.సి. మరియు అదనంగా మణుగూరు ఓసీలోనూ ఉత్పత్తికి చర్యలు తీసుకోనున్నందున ఎక్స్‌ ప్లోజివ్స్‌ అవసరం పెరగనుందని, ఈ నేపథ్యంలో వంద శాతానికి సరఫరాను పెంచాలని ఆదేశించారు.అలాగే కొన్ని గనుల్లో బ్లాస్టింగ్‌ విఫలమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నాణ్యమైన ఎక్స్‌ ప్లోజివ్స్‌ సరఫరా చేయాలని, ఇండెంట్‌కు అనుగుణంగా గనులకు ఎక్స్‌ ప్లోజివ్స్‌ సమకూర్చాలని స్పష్టం చేశారు.

గతంలో జరిగిన సమావేశం మేరకు ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీదారులు, సరఫరాదారుల సమస్యలను చాలావరకు పరిష్కరించిన విషయాన్ని డైరెక్టర్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్ణీత లక్ష్యాల మేరకు ఓబీ, బొగ్గు తొలగింపు కోసం ఏరియాల వారీగా వివిధ గనుల అవసరాల మేరకు కావాల్సిన ఎక్స్‌ ప్లోజివ్స్‌ వివరాలను సంబంధిత జనరల్‌ మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ కో ఆర్డినేషన్‌ మరియు మార్కెటింగ్‌ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ.. బ్లాస్టింగ్‌ ఇంచార్జ్‌ లు, సర్వే అధికారులు, ఆఫ్‌ లోడిరగ్‌ ప్రతినిధులు రోజు సమావేశాలు నిర్వహించుకుంటూ సమన్వయంతో బ్లాస్టింగ్‌ కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే పౌడర్‌ ఫ్యాక్టర్‌ను మరింత మెరుగు పరిచేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీ, సరఫరా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ సింగరేణి ఇండెంట్‌ కు అనుగుణంగా సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు.

- Advertisement -