టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. తాజాగా రిలయన్స్ జియో సిమ్లు సెప్టెంబర్ 5 నుండి అందరికీ అందుబాటులో ఉంటాయని, డిసెంబర్ 31 వరకు ఉచిత సేవలుంటాయని రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ గురువారం వెల్లడించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ సమావేశం గురువారం ముంబయిలో జరిగింది. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. డిజిటల్ లైఫ్కు డేటా అనేది ఆక్సిజన్ లాంటిది. జియో సేవల ద్వారా భారత డేటా స్టోరేజ్ నుంచి డేటా సమృద్ధి స్థాయికి చేరుతుందన్నారు. ఇంటర్ కనెక్షన్ సమస్య వల్ల ఇప్పటివరకు 5 కోట్ల ఫోన్ కాల్స్ ఫెయిల్ అయ్యాయని అన్నారు. రిలయన్స్ జియో సేవలకు అడ్డు తగలొద్దని ఇతర టెలికాం సంస్థలకు ముఖేష్ అంబానీ ఈ సంధర్బంగా విజ్ఞప్తి చేశారు.
మూడు నెలల పాటు రిలయన్స్ జియో ఎలా పనిచేస్తుందో కస్టమర్లకు తెలియజేయడం కోసమే ఉచిత సేవలను అందించాలని నిర్ణయించామని, కమర్షియల్ లాంచింగ్ తరువాత, డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, వాయిస్, వీడియో, ఆప్స్ సేవలను అందుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకూ ఎలాంటి చార్జీలనూ వసూలు చేయబోమని, ఆపై కూడా కేవలం రూ. 50కే 1 జీబీ డేటాను పొందవచ్చని ఆయన తెలిపారు. తమ కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు అత్యాధునిక టవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామని వివరించారు. డిజిటల్ ఇండియాలో ఇదొక విప్లవమని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికల్లా దేశంలో కోటి వైఫై కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముఖేశ్ అంబానీ ప్రకటించారు.
దేశంలో 2017 నాటికి 90 శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పండుగ రోజుల్లో కూడా మెసేజ్ల బ్లాకేజ్ ఉండదని తెలిపారు. 5 జీ 6జీ దిశగా అడుగలు వేస్తున్నామన్నారు. 5 పైసలకే ఒక ఎంబీ, రూ.50కి జీవీ డేటా సేవలు అందిస్తామన్నారు. 300 పైగా ఛానల్స్ లైవ్లో చూడొచ్చన్నారు. అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, 60 వేల మ్యూజిక్ ఉచితంగా అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
డేటా సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే జియోను విడుదల చేస్తున్నామని, జియో ద్వారా కస్టమర్లకు ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో పాటు జియో నుంచి ఏ నెట్వర్క్కైనా ఉచిత రోమింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోని విద్యార్థులకు 25శాతం అదనపు డేటా ఉచితమని వెల్లడించారు.
రూ.1కే 300 నిమిషాల టాక్టైమ్
ఇక జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూపాయికే 4జీ నెట్వర్క్ కింద 300 నిమిషాల పాటు యాప్-టు- యాప్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అమలులో ఉండనున్నది. అంటే రోజుకు పది నిమిషాల చొప్పున 30 రోజుల వరకు 300 నిమిషాల పాటుకాల్ చేసుకునే అవకాశం లభించనున్నది. దీంతోపాటు వినియోగదారుడికి రోజుకు 7 మెగాబైట్స్ చొప్పున డేటా ఉచితంగా లభించనున్నదని ఆర్కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు దేశంలో 11 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు.
రూ.51కే జీబీ డేటా
రిలయన్స్ జియో 4జీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.. డేటా చార్జీలను 80 శాతం వరకు తగ్గించినట్లు ప్రకటించింది. కేవలం రూ.51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటాను వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలంటే ముందుగా వినియోగదారుడు రూ.1,499తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దాంతో 28 రోజుల వరకు 1జీబీ డేటా ఉచితంగా లభ్యమవనున్నది. ఈ తర్వాత నెలకు రూ.51కే జీబీ డేటాను పొందవచ్చు. 12 నెలలకు వర్తించనున్న ఈ ఆఫర్ కింద ఎన్నిసాైర్లెన రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతోపాటు రూ.748తో రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు నెలకు రూ.99కే జీబీ డేటాను అందిస్తున్నది. ప్రస్తుతం ఎయిర్టెల్ 1జీబీ డేటాకోసం(3జీ, 4జీ) రూ.259 చార్జీ చేస్తున్నది.