రాజ్యాంగ బద్ధంగానే టీఆర్‌ఎస్‌లో చేరాం..

310
CLP merge
- Advertisement -

సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నేడు టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ…

మేము కాంగ్రెస్‌ను వీడటానికి అనేక కారణాలు ఉన్నాయి.కాంగ్రెస్ గ్రూపిజంతో సతమతమవుతోంది అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సివచ్చింది. మా రాజీనామాకు కారణాలు స్పష్టంగా లేఖ ద్వారా వివరించామన్నారు.అవసరమైతే రాజీనామా చేస్తామని లేఖలో వివరించాం.రాజ్యాంగ బద్దంగా మాకున్న హక్కు తోనే స్పీకర్‌ను విలీనం కొసం వినతి పత్రం ఇచ్చాము. అందుకే స్పీకర్ విలీనానికి అంగీకరించారు. కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది.మొన్నటి పరిషత్ ఎన్నికల్లో 32 జడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌కు ప్రజలు అప్పగించారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ బుద్ది మారడం లేదని ఎద్దేవ చేశారు.

MLA Rega Kantha Rao

తమ వైఫల్యాలకు కాంగ్రెస్ కారణాలు వెతుక్కోవాలి. నేతలకు భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమయ్యిందని విమర్శించారు. మా మీద అనవసర ఆరోపణలు చెస్తే పరువు నష్టం దావా వేస్తామని.. మేము కూడా సుప్రీం కోర్టుకు వెళ్తామని ఎమ్మెల్యే రేగ కాంతారావు తెలిపారు. పదో షెడ్యూలు స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ నేతలకు చదువు రాదా ?…ఉత్తమ్, భట్టి నియోజకర్గాల్లో కూడా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూసింది అన్నారు.

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్‌పై మాకున్న అసంతృప్తిని చాలా సార్లు వ్యక్తం చేశాం కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో టీఆర్‌ఎస్‌లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రకారమే మేము టీఆర్‌ఎస్‌లో చేరామని… మేము ప్రలోభాలకు లొంగి పోవడానికి ,అమ్ముడు పోవడానికి గొర్రెలం ,బర్రెలం కాదని గండ్ర తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. ఎవరూ పాలన చేసిన రాజ్యాంగం ప్రకారమే చేస్తారు. మేము రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాం. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారు. మా నిర్ణయాన్ని జడ్పీ ఎన్నికల్లో ప్రజలు సమర్ధించారు. నా భార్య జ్యోతి జడ్పీటీసీగా పది వేల ఓట్లతో గెలిచారు. మా నిర్ణయాన్ని ప్రజలు సమర్ధించారు. కాంగ్రెస్ నేతలు మాపై విమర్శలు ఆపక పోతే పరువు నష్టం దావా వేస్తాం.

త్రిపుర ,గోవాలో కూడా ఇలాంటి విలీనాలు జరిగాయి. ప్రధాని కూడా ఇటీవల బెంగాల్‌లో 40 మంది టీఎంసి ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరుగుతుంది. ఆ ఎన్నికల్లో తేల్చుకుందామన్నారు. మా రాజీనామాలు అవసరం లేదు. అవసరమని భావిస్తే చేయడానికి వెనకాడం. అభివృద్ధి ,రాష్ట్ర సంక్షేమమే మా ప్రాధామ్యాలు అన్నారు.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… మమ్మల్ని విమర్శిస్తున్న వారు రాజ్యాంగం పదో షెడ్యూలు చదువుకుంటే మంచిది. ఇంతకు ముందు వేరే రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా జరిగాయన్నారు.

- Advertisement -