సింధును అభినందించిన సీఎం కేసీఆర్

303
- Advertisement -

పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఒలింపిక్స్ లో రజతం సాధించిన పివి సింధు, కోచ్ పుల్లెల గోపీ చంద్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తాను సాధించిన పతకాన్ని సింధు ముఖ్యమంత్రికి చూపించారు. పివి సింధును హృదయపూర్వకంగా అభినందించిన ముఖ్యమంత్రి, అమెును ఘనంగా సన్మానించి, రూ.5 కోట్ల చెక్కును అందించారు. కోచ్ గోపిని కూడా అభినందించి, కోటి రూపాయల చెక్ అందించారు.

KKP_0956

పివి సింధు దేశం గర్వపడే విధంగా ప్రతిభ ప్రదర్శించి పతకం సాధించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. కోచ్ గోపీ చంద్ కూడా తన అకాడమీ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారన్నారు. సింధును క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులు పివి రమణ, విజయలను కూడా సిఎం అభినందించారు. పివి సింధు రజతం సాధించడం గొప్ప విషయమని, అదే సందర్భంలో ఇంత పెద్ద దేశం కేవలం రెండు పతకాలే గెలిచిందనే విమర్శ కూడా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో క్రీడాకారులు ఎవరికి వారు ఎదిగి పతకాలు సాధిస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం లభించడం లేదనే భావన ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఒలంపిక్ పతకాలు సాధించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, కోచ్ లు, క్రీడా సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఇురారు చేయాలన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామని చెప్పారు.

KKP_0984

గతంలో అన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో ఆటలు ఆడేవారని, కానీ ఇప్పుడు పరీక్షల్లో మార్కులు సంపాదించడమే లక్ష్యంగా మారి క్రీడలను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రభుత్వ పరంగా కూడా మరింత బొరవ అవసరం అని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులున్నారని, ఇంకా పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉందన్నారు. వారంద్రీకి తగిన చేయూత,ప్రోత్సాహం అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా క్రీడా ప్రాంగణాలున్నాయని, వాటిని ఉపయోగంలోకి తేవాలని సిఎం అన్నారు. జిల్లాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తామన్నారు. హకీంపేటలో క్రీడల కోసం కేటాయించిన 300 ఎకరాలను కూడా సంపూర్ణంగా వినియోగించాలన్నారు. విశ్వ క్రీడా పోటీలకు వేదికగా హైదరాబాద్ ను మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అదే సందర్భంలో తెలంగాణ పిల్లలు అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం పూనుకుంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాద్ పాల్గొన్నారు.

KKP_1046

పివి సింధుకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన చల్లగుండ్ల కిరణ్ కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒలంపిక్స్ లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్ కు కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని టాప్ 50 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఆరుగురు గోపీ చంద్ అకాడమీకి చెందిన వారే కావడం గర్వకారణమన్నారు. అకాడమీకి అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తామని సిఎం చెప్పారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు చేయాలని సిఎం కోరారు.

KKP_1056

హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్ళి రాజీప్ శర్మ, ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీలు కొండా మురళీధర్ రావు, పూల రవీందర్, వెంకటరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సలీం తదితరులు సింధును అభినందించారు.

KKP_1000

- Advertisement -