‘మజ్ను’ ఆడియో

585
Majnu Movie Audio Launch
Majnu Movie Audio Launch
- Advertisement -

నేచురల్‌ స్టార్‌ నాని, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న చిత్రం ‘మజ్ను’. ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏషియన్‌ నారాయణ దాస్‌, సునీల్‌, హీరో నాని, దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, అనీల్‌ సుంకర, రాజ్‌ తరుణ్‌, ఇంద్రగంటి మోహనకృష్ణ, మారుతి, హను రాఘవపూడి, కల్యాణ్‌కృష్ణ, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీ, గోళ్ళ గీత, పి.కిరణ్‌, విరించి వర్మ, గోపీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.
బిగ్‌ సీడీని ఏషియన్‌ మూవీస్‌ నారాయణ దాస్‌ విడుదల చేయగా, ఆడియో సీడీలను హీరో నాని విడుదల చేసి తొలి సీడీని రాజ్‌ తరుణ్‌కు అందించారు.
దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, అనీల్‌ సుంకర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా… హీరో నాని మాట్లాడుతూ – ”అందరూ అనుకుంటున్నట్లు బాధలో ఉండే మజ్ను కథ ఈ సినిమా కాదు. ప్రేమలో పడి సమస్యల్లో ఉన్నట్లు కనపడే ఎవరినైనా మజ్ను అనే అంటాం. ఇక మా మజ్ను సినిమా విషయానికి వస్తే బోర్‌ కొట్టదు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఇంటికి వెళ్ళినా గుర్తుకు వస్తుంటాడు. ఉయ్యాలా జంపాలా కథను దర్శకడు విరించి వర్మ ముందు నాకే చెప్పాడు. కాబట్టి నాకు అప్పటి నుండి మంచి పరిచయం. తను చాలా మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి. తన నిజాయితీ తన సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌లో కనపడుతుంది. ప్రేక్షకులు అందుకే తన సినిమాను తమదిగా భావిస్తారు. అందుకే ఉయ్యాలా జంపాలా పెద్ద హిట్‌ సాధించింది. దాని కంటే మా మజ్ను ఇంకా పెద్ద హిట్‌ సాధిస్తుంది. కిరణ్‌గారు, గీతగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నాకు అష్టాచమ్మా రోజులు గుర్తుకు తెచ్చిన సినిమా ఇది. యూనిట్‌ సభ్యులందరితో ఒక సభ్యుడిగా కలిసిపోయి ఈ సినిమా కోసం పనిచేశాను. హీరోయిన్స్‌ అనుఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీలు చక్కగా యాక్ట్‌ చేశారు. గోపీ సుందర్‌తో భలే భలే మగాడివోయ్‌ తర్వాత చేస్తున్న మూవీ ఇది. నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూ చేశాం. అందరికీ థాంక్స్‌” అన్నారు.
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ – ”మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాగే ప్రేమలో వున్నప్పుడు అది ఎన్ని రోజులు వుంటుందనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ ‘మజ్ను’ చిత్రాన్ని రూపొందించాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు రొమాంటిక్‌ ఫీల్‌ వున్న చిత్రం” అన్నారు.
సంగీత దర్శకుడు గోపిసుందర్‌ మాట్లాడుతూ – ”లవ్‌కి, మ్యూజిక్‌కి లాంగ్వేజ్‌ అవసరం లేదు. నాని ఈ సాంగ్స్‌ విని నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ని ఇచ్చారని అనడం సంతోషాన్ని కలిగించింది. రామజోగయ్యశాస్త్రి మంచి లిరిక్స్‌ ఇచ్చారు. దర్శకనిర్మాతలు లవ్‌ అండ్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – ”కిరణ్‌గారు చేసిన అంత:పురం, నువ్వు నేను, బీరువా సినిమాలను చూస్తే ఆయన స్క్రిప్ట్‌ విషయంలో చాలా సెలెక్టివ్‌గా వుంటారని తెలుస్తుంది. ట్రైలర్‌ చూస్తుంటే సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్‌ అవుతుందనిపిస్తుంది. నాని వరసగా నాలుగు హిట్స్‌ కొట్టాడు. ఇది తనకు ఐదో హిట్‌ అవుతుంది” అన్నారు.
అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”నాని హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ మూవీస్‌నే చేస్తూ వస్తున్నాడు. దర్శకనిర్మాతల హీరో. తన సినిమాలు అందరూ చూసే విధంగా వుంటాయి. నిర్మాత కిరణ్‌గారి విషయానికి వస్తే మంచి కథల్నే సినిమాలుగా చెయ్యడానికి ఆయన ఆసక్తి చూపిస్తారు. గోపీసుందర్‌గారి మ్యూజిక్‌ ఫ్యాబులస్‌గా వుంది. నాని సెకండ్‌ హ్యాట్రిక్‌ కంటిన్యూ అవుతుంది” అన్నారు.
ఎన్‌.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ”నాని హార్డ్‌ వర్క్‌ చేసే హీరో. హ్యాట్రిక్‌ సాధిస్తూ వున్నాడు. ఆనంది ఆర్ట్స్‌ జెమిని కిరణ్‌గారు, గోళ్ళ గీతగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హను రాఘవపూడి మాట్లాడుతూ – ”నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అందరికీ కంఫర్టబుల్‌గా వుండే హీరో. అలాగే మంచి కథల్ని ఎంచుకుంటూ మంచి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తూ వుంటాడు. ఈ సినిమా తనకి, విరించి వర్మకు, నిర్మాతలకు పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మారుతి మాట్లాడుతూ – ”నాని ఫెయిల్యూర్‌ వచ్చినా చాలా పాజిటివ్‌గా ఆలోచించే హీరో. తనతో భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ సినిమా చేశాను. తనతో పనిచేస్తున్నప్పుడు సొంత సినిమాకి పనిచేస్తున్న ఫీల్‌ కలుగుతుంది. విరించి వర్మ తన టేస్ట్‌కి తగ్గ సినిమాలు చేస్తూ వస్తున్నారు. గోపిసుందర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతలకు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాను” అన్నారు.
కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ – ”ముద్దు పేరునే స్క్రీన్‌ పేరుగా మార్చుకున్న హీరో. తనతో ఎప్పుడో సినిమా చెయ్యాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. నాని సినిమాలు ఎంటర్‌టైన్‌ చేస్తాయని కాకుండా, నానియే ఎంటర్‌టైన్‌ చేస్తాడు అనే రేంజ్‌కి ఎదిగాడు. అలాగే కిరణ్‌గారి జడ్జిమెంట్‌పై నాకు నమ్మకం వుంటుంది. గీత గారు ఎంతో ప్యాషన్‌తో ఈసినిమాను నిర్మించారు. విరించివర్మకు మరో మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ”ఎనిమిది సంవత్సరాల క్రితం నాని తొలి చిత్రం అష్టా చమ్మా సెప్టెంబర్‌ 5న విడుదలైంది. ఇప్పుడు అదే నెలలో ఆడియో, సినిమా రిలీజ్‌ అవుతోంది. మంచి ప్యాషన్‌ వున్న హీరో. దర్శకుడు విరించివర్మ, నిర్మాతలు కిరణ్‌, గీతలకు, ఎంటైర్‌ టీమ్‌కి ఆల్‌ది బెస్ట్‌” అన్నారు.
అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”నేను, నాని ఒకే సినిమాతో పరిచయమయ్యాం. ఇప్పుడు మా ఇద్దరి సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌ అవ్వడం హ్యాపీగా వుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

- Advertisement -