ప్రజలు కోరితే ప్రతిపాదనల్లో మార్పు

580
- Advertisement -

సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం, ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావడం కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి టాస్క్ పోర్స్ కు సరైన సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉంటే అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పులు, చేర్పులు చేయాలని చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంకేమ కార్యక్రమాలను సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజలకు సౌకర్యంగా ఉండడమే ప్రాతిపదికగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాట్లు జరుగుతున్నదని, ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రతిపాదనలను మార్చుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి శషబిషలు లేవని సిఎం స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా రాజకీయ కారణాలతో కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించాలని సూచించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే ప్రతిపాదన ఏదీ లేదని సిఎం స్పష్టం చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాలపునర్విభజన జరిగిన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఖచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని సిఎం చెప్పారు. దేశంలో ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించాయని సిఎం వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు స్వర్ణయుగం రాబోతున్నదని, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, పాలమూరు ప్రాజెక్టు కూడా శరవేగంతో కట్టుకుంటామని చెప్పారు. నీటి పారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. వలసలు పోయిన వారంతా తిరిగి పాలమూరుకు చేరుకునే రోజులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

పాలమూరు జిల్లా అంతా నీటి సౌకర్యం వస్తుంది కాబట్టి, రైతులెవరూ తమ భూములు అమ్ముకోవద్దని సిఎం పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పధకం ద్వారా నీటి విడుదల జరగడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పిన ముఖ్యమంత్రి, పాలమూరు ప్రజలను, ప్రజాప్రతినిధులను అభినందించారు. కృష్ణా నది వల్ల ఎక్కువ ప్రయోజనం పాలమురు జిల్లాకే కలుగుతుందని చెప్పారు. పాలమూరు రైతులకు నీళ్లివ్వడం గొప్ప కార్యంగా తాను భావిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. భౌగోళికంగా చాలా పెద్దదైన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా మారడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని జాతీయ రహదారులకిరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, తెలంగాణలో అడుగుపెట్టేవారికి పాలమూరు జిల్లా ఆకుపచ్చ తోరణాలతో స్వాగతం పలికినట్లుండాలని సిఎం చెప్పారు.

హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. హెల్త్, ట్రైబల్ యూనివర్సిటీలతో పాటు అనేక విద్యాసంస్థలను మంజూరు చేశామని, టెక్స్ టైల్ పార్కు నిర్మించబోతున్నామని వెల్లడించారు. బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించామని… ప్రణాళికాబద్దంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత, కొన్ని మండలాలు యూదాద్రిలో, కొన్ని మండలాలు సిద్దిపేటలో కలుస్తున్నాయన్నారు. మిగిలిన మండలాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందున వరంగల్ జిల్లాను రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించినట్లు సిఎం చెప్పారు. రెండు జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే అంశంపై ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

వరంగల్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై కాజీపేట వద్ద పాతిమా బ్రిడ్డికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి, నాలుగు లేన్ల రోడ్డుగా మార్చనున్నట్లు సిఎం ప్రకటించారు. వెంటనే అంచనాలు రూపొందించాలని నేషనల్ హైవేస్ ఇ ఎన్ సి గణపతి రెడ్డిని ఆదేశించారు. మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపు 5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలాన్ని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనలను పరిశీలించాలని సిఎం అదికారులను ఆదేశించారు.

ఖమ్మం జిల్లా గుండాల మండలం విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉన్నందున ఆ మండలాన్ని రెండుగా విభజించాలని చెప్పారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలాన్ని సమీపంలోని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని సిఎం అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని సిఎం చెప్పారు. కొడకండ్ల మండలాన్ని తొర్రూరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో టేకుమట్ల, పెద్ద వంగర, కొమురవెల్లి మండలాల ఏర్పాటుకున్నఅవకాశాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -