పేదల కోసం దత్తన్నను కలిసిన పద్మారావు..

682
T.Padma Rao met Minister Bandaru Dattatraya
- Advertisement -

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పేదలకు ఇళ్లు నిర్మించడం కోసం రైల్వే భూములు ఇప్పించడానికి నా శాయశక్తులా క్రుషి చేస్తానని కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖల మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సోమవారం సికింద్రాబాద్ శాసనసభ్యుడు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మరావు శ్రీ బండారు దత్తాత్రేయని కలసి పేదల ఇళ్ల నిర్మాణానికి రైల్వే భూములు ఇప్పించడంలో సహకరించమని కోరారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలో ఉన్న పేదలకు ఇళ్ళు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉన్నా భూమి అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదని పద్మారావు దత్తాత్రేయ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన శ్రీ బండారు దత్తాత్రేయ వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడారు.

T.Padma Rao met Minister Bandaru Dattatraya

మౌలాలి తార్నాక వద్ద ఉన్న 12 ఎకరాల 16 కుంటల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానకి అప్పగిస్తే దాదాపు నాలుగు వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశం ఉందని పద్మారావు చెప్పడంతో నాకు చాలా సంతోషం అనిపించిందని దత్తాత్రేయ అన్నారు. ఈ భూమి చుట్టుపక్కల కూడా అనేక ఇళ్ల నిర్మాణం జరిగిపోయిందని అందువల్ల దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని శ్రీ దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ భూమి తమకు అప్పగించమని గతంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు కోరిందని అయితే ఈ భూమిని 2007లోనే రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అధారిటీకి ఇచ్చివేసినట్లు… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలంటే కొంత ఇబ్బంది ఉందని రైల్వే అధికారులు తెలిపారని కేంద్రమంత్రి తెలిపారు.

పేదలకు ఇళ్లు కట్టివ్వడమనేది ప్రధాని నరేంద్రమోడీ సంకల్పమని అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న గ్రుహాలకు రెండు లక్షల సబ్సిడీ కేంద్ర ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ భూమికి సంబంధించి ఇప్పటికే రైల్వే అధికారులతో తాను మాట్లాడానని చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరించవల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వేకు ఇచ్చి ప్రతిగా మౌలాలీ, తార్నాకలో ఉన్న రైల్వే భూమిని అడగవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే జియం వినోద్ కుమార్ యాదవ్ సలహా ఇచ్చారని దత్తాత్రేయ తెలిపారు. రేపు తెలంగాణ మంత్రి శ్రీ పద్మారావుతో కలిసి రైల్వే మంత్రి శ్రీ సురేష్ ప్రభుని కలసి తార్నాక రైల్వే భూమి విషయమై చర్చిస్తామని రైల్వే శాఖ అధికారులను కూడా రమ్మని అడిగానని శ్రీ దత్తాత్రేయ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి తాను తప్పకుండా క్రుషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీ దత్తాత్రేయ స్పష్ట చేశారు.

T.Padma Rao met Minister Bandaru Dattatraya

సోమవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలసి పలు సమస్యలు పరిష్కరించడానికి సహకరించమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు వినతిపత్రం అందచేశారు. ప్రధానంగా న్యూ బిల్డింగ్ బైలాస్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అమలు చెయ్యడానికి అనుమతి ఇప్పించవల్సిందిగా బోర్డు సభ్యులు దత్తాత్రేయను కోరారు. న్యూ బిల్డింగ్ బైలాస్ అమలు వల్ల కంటోన్మెంట్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా నిర్మూలించవచ్చని…ఇదే సమయంలో బోర్డుకు కూడా ఆదాయం పెరుగుతుందని బోర్డు సభ్యులు దత్తాత్రేయకు వివరించారు. అలాగే మిలట్రీకి చేసిన సేవలకు కాను కంటోన్మెంట్ బోర్డుకు రక్షణ శాఖ ఇవ్వాల్సిన సర్వీసు ఛార్జ్ బకాయిలు 350 నుంచి 400 కోట్లు ఉంటాయని వెంటనే ఆ నిధులను విడుదల చేయించాలని బోర్డు సభ్యులు దత్తాత్రేయను కోరారు.

కంటోన్మెంట్ పరిధిలో భూముల విలువ చాలా ఉందని అందువల్ల హయ్యర్ ఎఫ్ఎస్ఐకి అనుమతి ఇప్పించాలని దీనితో పాటు పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ట్రాన్సఫర్ పాలసీ ఖరారు చేయించమని కేంద్రమంత్రి దత్తాత్రేయను కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అభ్యర్ధించారు. బోర్డు సభ్యులు ఇచ్చిన వినతి పత్రాన్ని వెంటనే కేంద్ర రక్షణ శాఖకు పంపిన దత్తాత్రేయ కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రితో కూడా మాట్లాడారు. రేపు అరుణ్ జైట్లీని కూడా కలసి కంటోన్మెంట్ లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా క్రిషి చేస్తానని బోర్డు సభ్యులకు శ్రీ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

- Advertisement -