తెలంగాణకు బాబు బై బై

241
- Advertisement -

ఎప్పుడు ముభావంగా కనిపించే ఏపీ సీఎం చంద్రబాబు కంటతడి పెట్టారు. మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో బాబు కళ్లల్లో పదే పదే నీళ్లు తిరిగాయ్. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బాబు…నలభై ఏళ్ల అనుబంధం…ఈ గాలి…ఈ నేల…పరిసరాలు…అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

హైదరాబాద్‌లో ఇవే చివరి సమావేశాలు అనుకుంటున్నా.. అత్యవసరమైతే తప్ప లేకపోతే అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ అసెంబ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1980లో తొలిసారిగా శాసనమండలికి వచ్చానని … నాటి అనుభవాలను నెమరేసుకున్నారు. 38 ఏళ్లలో చాలా సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ చూస్తే ఇప్పటికీ ఆనందంగా ఉంటుందని తెలిపారు.చివరి సమావేశాలు కదా గుర్తుగా ఉండాలని మిత్రులతో ఫోటోలు కూడా దిగాను అని చెప్పారు.

chandrababu

ఇదే సభలో నన్ను ఎన్నో మాటలు అన్నారని…కొంతమంది చెప్పుతో కొడతానని అన్నారని, మంచిపనులు చేసినప్పుడు ఇలాంటి మాటలు తప్పవని చంద్రబాబు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మాటకు బాధపడినా మనసులో పెట్టుకున్నానన్నారు. హైద‌రాబాద్ గురించి మాట్లాడితే అప్పట్లో తనను ఎగ‌తాళి కూడా చేశార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చూస్తే ఇప్ప‌టికీ త‌న‌కు ఆనందంగా ఉంటుందని ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తిని కూడా అద్భుతంగా నిర్మిస్తామ‌ని పేర్కొన్నారు. త‌న‌ను పొగిడే వారు పొగుడుతున్నారని.. విమ‌ర్శించే వారు విమ‌ర్శిస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కేంద్రం చెబుతోందని అన్నారు. కేంద్రం పెద్ద‌లు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇస్తామంటున్నారని ఆయ‌న పేర్కొన్నారు. పోల‌వ‌రం నిర్మాణంపై కూడా ప‌లువురు విమ‌ర్శలు చేస్తున్నార‌ని, హోదా వ‌చ్చే వ‌ర‌కూ పోల‌వ‌రం నిర్మాణం చేయ‌వ‌ద్దా? అని ప్ర‌శ్నించారు. తానెప్పుడైనా రాజీ ప‌డితే అది ప్ర‌జ‌ల కోస‌మేన‌ని, త‌న‌కు ప్రజ‌లే హై క‌మాండ్ అని ఆయ‌న అన్నారు. మూర్ఖంగా ముందుకు వెళితే ఏదీ మిగ‌ల‌దని వ్యాఖ్యానించారు. ఇక హైదరాబాదులోని అసెంబ్లీకి రాబోమన్న విషయాన్ని తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు సీఎం చాంబర్ లోకి వెళ్లి చంద్రబాబుతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.

- Advertisement -