ట్రెండింగ్‌లో విశాల్- ఆర్య ‘ఎనిమీ’ టీజర్..

87
- Advertisement -

తమిళ హీరోలు విశాల్ ఆర్య కాంబినేషన్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఎనిమీ. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గద్దల కొండ గణేష్‌ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో నటించారు. మూవీ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజ‌ర్‌ను చిత్ర బృందం తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేశారు.

ఒక నిమిషం న‌ల‌భై సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం యాక్ష‌న్ భ‌రింతంగా కొన‌సాగింది. టీజ‌ర్ చివ‌ర‌లో ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే అని విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్‌లో ఉంది. టైటిల్‌కు తగినట్లుగానే ఆద్యంతం ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. టీజ‌ర్ విడుద‌లైన కేవ‌లం నాలుగు గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి.

స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఎవరి బలహీనతలతో ఎవరు ఆడుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

- Advertisement -