జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

472
- Advertisement -

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్, శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. శాసనసభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీఎస్టీ బిల్లుకు సంబంధించిన అంశాలను వివరించారు.

సిఎం మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుపై అనేక చర్చలు జరిగాయి.ఈ బిల్లును శాసనసభలు అమోదించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం గవర్నర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును పాస్ చేశారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీలు ఏకమై ఈ బిల్లును పాస్ చేశాయి. కొన్ని రాష్ట్రాలకు అనుమానాలున్నాయి. తయారీదారులుగా ఉన్న రాష్ట్రాలకు ఈ చట్టం వల్ల లాభం జరుగుతుందని, వినియోగదారులుగా ఉన్న రాష్ట్రాలకు లాభం జరుగుతుందని వివిధ రకాల బిన్నాభిప్రాయాలున్నాయి. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం దేశ స్థాయిలో ఆర్థిక పరమైన బేస్‌ను పెంచడానికి, పన్నుల ఎగవేతను తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి, అన్ని సక్రమంగా జరగడానికి ఒకే దేశం..ఒకే పన్ను ఉండాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు. ఈ చట్టం వల్ల కొన్ని రాష్ట్రాలు తమకు తక్కువ వాటా వస్తుందనిపిస్తే, ఐదు ఏళ్ల వరకు కేంద్రమే భరిస్తుందని కేంద్రం హామి ఇచ్చింది. ఇందుకోసమే అన్ని రాష్ట్రాలు దీనికి అంగీకరించాయి. ఇందుకోసమే పార్టీలకతీతంగా హిమచల్ ప్రదేశ్‌, బీహార్, అస్సాం,మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును పాస్ చేశాయి. దేశంలోని సగం రాష్ట్రాలు పాస్ చేసి పంపిస్తేనే ఈ బిల్లు చట్టంగా వస్తుంది. ఇందుకోసం ప్రధాని మోడీ కూడా నాతో మాట్లాడారు. కేంద్రం నుండి వచ్చిన ఆదేశాల మేరకే ఈ సమావేశాలు ఏర్పాటు చేశినామని కేసీఆర్ అన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 9 రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును పాస్ చేశాయ‌న్నారు. తెలంగాణ ప‌ద‌వ రాష్ట్రంగా బిల్లును ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు. పెట్రోల్‌, ఎక్సైజ్ ట్యాక్సుల‌కు జీఎస్టీ వ‌ర్తించ‌ద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు సీఎం తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మ‌న్‌గా ఉంటార‌న్నారు. ఏ రాష్ట్రాలు కూడా త‌మ ప‌న్నులు కోల్పోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌వ‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు సీఎం తెలిపారు. దానికి త‌గ్గ‌ట్టుగా కేంద్రం స్పందించింద‌న్నారు.

జీఎస్టీ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.   జీఎస్‌టీ బిల్లుపై సభలో బీజేపీ శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీఎస్‌టీ బిల్లు సభలో ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను అభినందించారు. అన్ని వర్గాల ప్రజలకు జీఎస్‌టీ బిల్లు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశ వ్యాప్తంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నమన్నారు. జీఎస్‌టీ ద్వారా దాదాపు 17 రకాల పన్నుల భారం పోతుందన్నారు. జీఎస్‌టీ బిల్లు దేశ చరిత్రలో ఓమైలురాయిగా నిలుస్తోంది. జీఎస్‌టీ అంటే గ్రేట్ సెప్ బై ఇండియాగా అభివర్ణించారు. ఆరోగ్యకరమైన పోటీ అభివృద్ధికి బాటలు వేస్తుంది. జీఎస్‌టీ కౌన్సెల్‌లో 29 రాష్ర్టాల ఆర్థికమంత్రుల ప్రాతినిధ్యం వహించనున్నాయని వివరించారు. ఏకీకృత పన్నుల విధానం రాష్ర్టాలకు ఎంతో ప్రయోజనమని కిషన్ రెడ్డి అన్నారు. జీఎస్‌టీ ద్వారా అక్రమాలకు, కాలుష్యానికి కళ్లెం పడనుందని వెల్లడించారు.

- Advertisement -