జియోతో ఎయిర్‌టెల్‌ డీల్..

539
jio thumbnail
jio thumbnail
- Advertisement -

టెలికాం వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్ట్‌ ఇవ్వడానికి ఎయిర్‌ టెల్ ముందుకొచ్చింది. ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలు తమకు ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఇటీవల ముకేశ్ అంబానీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. దీంతో ఐడియా సోమవారం జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా ఇపుడు ఎయిర్‌టెల్‌ కూడా జియోతో ఇంటర్‌ కనెక్టింగ్‌ పోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. తాము ఏర్పాటుచేసే పోర్ట్‌లు జియో 1.5 కోట్ల మంది కస్టమర్ల కాల్స్‌ని సపోర్ట్ చేస్తాయని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.. జియో యూజర్లు ఎయిర్‌టెల్ యూజర్లకు ఫోన్ చేసుకోవచ్చు. తాజా చర్యతో ప్రస్తుత పోర్టుల సంఖ్య 3 రెట్లు పెరుగుతుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

airtel jio

ఇక జియో సిమ్ కార్డుల లభ్యత కష్టతరంగా ఉండటం, 4జీ సిగ్నల్స్ అన్ని ప్రాంతాల్లో ఇచ్చేందుకు రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ మధ్య ‘ఇంట్రా సర్కిల్ రోమింగ్’ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒకే టెలికం సర్కిల్ లో ఉన్న జీయో, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏ కంపెనీ టవర్ కు సమీపంలో ఉన్నా సేవలందుకోవచ్చు. అయితే జియోతో డీల్ పూర్తిగా కుదరలేదని, అతి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని బీఎస్ఎల్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మేలు కలిగేలా తమ నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. సంస్థ నెట్ వర్క్ కెపాసిటీని, నాణ్యతను పెంచుకుంటున్నామని, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లలో 4జీ సామర్థ్యమున్న ఫోన్లు వాడేవారు రిలయన్స్ 4జీ సేవలను పొందే రోజు త్వరలో వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము ఇదే తరహా ఒప్పందాన్ని వోడాఫోన్ తో కుదుర్చుకున్నట్టు గుర్తు చేశారు.

ఒకవేళ ఈ ఒప్పందం అమల్లోకి వస్తే బీఎస్ఎన్ఎల్ 4జీ కస్టమర్లు రోమింగ్ లో జియో 4జీ సేవలను అందుకోవచ్చు. ఇదే సమయంలో జియో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ 2జీ సిగ్నల్స్‌తో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే, రిలయన్స్ 4జీ సేవలను పొందే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏ మేరకు చార్జీలు చెల్లించాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ వెలువడలేదు. ఇదే సమయంలో తాము ఎలాంటి రోమింగ్ చార్జీలను విధించబోమని ఇప్పటికే ముఖేష్ అంబానీ స్పష్టం చేయడంతో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సేవలు పొందితే, కేవలం కాల్ చార్జీలు మాత్రమే చెల్లిస్తే చాలని తెలుస్తోంది.

- Advertisement -