కొత్త జిల్లాల్లో మార్పులు

262
kcr new districts
kcr new districts
- Advertisement -

వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చిన్నగూడూరు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మరిపెడ మండల సీనియర్ నాయకులు గుడిపూడి నవీన్, రామసహాయం రంగారెడ్డి, మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న తదితరులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు.

పెద్ద మండలమైన మరిపెడ మండలంలో చిన్న గూడూరు కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముఖ్యమంత్రిని కోరారు. మండల ప్రజల అభిప్రాయం కూడా చిన్న గూడూరు కేంద్రంగా మండలం ఏర్పాటు కావాలని ఉందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివరించారు. మరిపెడలోని 5, నర్సింహపేటలోని 4, కురవిలోని 2, మహబూబాబాద్లోని 3 గ్రామాలను కలిపి చిన్నగూడూరు మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ముఖ్యమంత్రికి అందించారు. కొత్త మండలం ఏర్పాటు కోసం పట్టుపట్టారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కొత్తగా ఏర్పడే మహబూబాబాద్ జిల్లాలో చిన్నగూడూరును కొత్త మండలంగా చేర్చాలని ఆదేశించారు.

అదే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొూయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలుపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తుది నోటిఫికేషన్ లో పొందుపరచాలని చెప్పారు. చేవెళ్ల ఎమ్యెల్యే కాలె యాదయ్య శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలతో కలిసి వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

మొూయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలు శంషాబాద్ కు సమీపంలో ఉంటాయని, ఈ మూడు మండలాల ప్రజలు శంషాబాద్ జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే యాదయ్య ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు మండలాలను శంషాబాద్ లోనే ఉంచాలని పట్టుపట్టారు. దీంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మూడు మండలాలను శంషాబాద్ లో చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మూడు మండలాలను శంషాబాద్ లో కలపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రికి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -