అక్షర తపస్వి దాశరథి రంగాచార్య జయంతి

2166
Dasaradhi Rangacharya
Dasaradhi Rangacharya
- Advertisement -

అక్షరమే ఆయన ఆయుధం. సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ కెరటం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన అభ్యుదయవాది. తన రచనలతో నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించిన మహోన్నత వ్యక్తి. తన రచనలతో సమాజాన్ని చైతన్యం చేసిన అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య. ఇవాళ ఆయన జయంతి.

దాశరధి రంగాచార్య సాహిత్య సాగరంలో ఆయన ఉరికే కెరటం.. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని వీరుడు. వేదం జీవన నాదం అంటూ వేదాలను ప్రజాజీవితంలోకి తెచ్చి వచన రూపంలో అందించిన ధైర్య శాలి. నవ సమాజం కోసం  తాపత్రయపడిన ఉద్యమశీలి. ఇలా చెప్తూ పోతే ఆయన జీవన ప్రస్ధానంలో ఎన్నో మైలు రాళ్లు.. మరెన్నో జ్ఞాపకాలు..

ప్రజా ఉద్యమంలో వేద భారతాన్ని అన్వేషించిన అక్షర తపస్వీ, అమృత వాత్సల తేజస్వీ డాక్టర్‌ దాశరధి రంగాచార్య.. మార్క్సిస్ట్ గా పోరు బాటలో నడిచినా, వచనా వేదాల్ని రచించినా ఆయన శ్వాస, ధ్యాస అంతా మానవ శ్రేయస్సు గురించే.. సమసమాజ ఆవిష్కరణ గురించే.. సద్గుణ సంపన్నుడైన సద్గుణ మానవున్ని దర్శించాలన్నదే ఆయన మహా సంకల్పం..

చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు.. ఆపదల్లోనే ఉన్నతుడవుతాడు.. మనిషైనా జాతైనా అంతే..

తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్ కు ముచ్చెమటలు పట్టించారు దాశరధి రంగాచార్య. తెలంగాణ మట్టి జీవితాన్ని, వెట్టి జీవితాన్ని అక్షరాల్లోకి ఎలుగెత్తి చాటిన రచయిత, ఉద్యమకారుడు దాశరథి  రంగాచార్య. తన రచనలతో పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. ఇవాళ 88వ జయంతి. వరంగల్ జిల్లా చిన్న గూడురులో 1928 ఆగస్టు 24న  విద్వాన్ వెంకటాచర్య-  శ్రీమతి వెంకటమ్మ దంపతులకు జన్మించారు రంగాచార్య

చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలను చవిచూశారు దాశరథి రంగాచార్య. పుట్టింది పండిత కుటుంబమే అయినా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు దాశరథి. వీరి అన్న దాశరథి కృష్ణమాచార్యుల నుంచి అభ్యుదయ, విప్లవ భావాలను అలవర్చుకున్నారు రంగాచార్యులు. తెలంగాణ సాయుథ పోరాటంలో ఇద్దరూ కలిసి సైనికులుగా పనిచేశారు. భూమి  కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ఉద్యమ జీవితాన్ని సాహిత్య రూపంలో ప్రజలకు అందించారు రంగాచార్య

12 ఏళ్ల వయస్సులోనే నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు రంగాచార్య. నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ పోరాటాలకు ఆకర్శితులై వాటి తరపున ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు దాశరథి రంగాచార్య. 1948 లో పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ కు విముక్తి లభించింది. సాయుధ పోరాటం విరమణ తర్వాత ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 32 ఏళ్లు ఉద్యోగం చేసి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైరయ్యారు

తన 40 ఏళ్ల జీవితంలో అక్షర ప్రస్థానం ప్రారంభించి ఎన్నో నవలలు, గ్రంధాలు రాశారు.  శ్రీమద్రామాయణం, మహాభారతాలను సరళంగా తెలుగులో రాశారు దాశరథి రంగాచార్య. తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా 4 వేదాలను తెలుగులోకి అనువందించారు రంగాచార్య. మోదుగు పూలు, చిల్లరదేవుళ్లు, జనపది, రానున్నది  ఏది నిజం, మాయజలతారు వంటి ఎన్నో అద్భుతమైన నవలలు ఆయన కలం నుంచి జాలువారాయి. తన ఆత్మకథగా వచ్చిన జీవనయానం కూడా తెలంగాణ ఉద్యమం, ప్రజల జీవన స్థితిగతులను చాటి చెబుతోంది.

నుదుటిపైన ఊర్దపుండ్రాలు ఉన్నప్పటికీ మార్క్సిస్టు అవగాహనతోనే రచనలు చేశారాయన. వేదవాఙ్మయాన్ని ప్రజలందరికి చేర్చడానికి ఈ అభ్యుదయ దృక్పథమే తనను పురిగొల్పిందని ఆయన చెప్పుకున్నారు. వేదాలను స్త్రీలు, శూద్రులు చదవకూడదనే దృక్పథాన్ని ఈ విధంగా ఆయన తోసిపుచ్చారు. దాశరథి రం గాచార్య జీవన యానం చదివితే మొత్తం ఆయననే చదివినట్టు. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో సమగ్రంగా చదివినట్టు.
ఒడ్డున కూర్చుని పుంఖానుపుంఖాలుగా రచనలు చేసిన వారి కి పూర్తి భిన్నంగా,తెలంగాణ కవుల సంప్రదాయానికి అనుగుణం గా స్వయంగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల పక్షం నిలిచారు. తన నెత్తిపై నుంచి తుపాకి గుండు దూసుకు పోయినా చలించని ధీశాలి రంగాచార్య.

రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్లు పలు భాషల్లోకి అనువాదమైంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. అభినవ వ్యాసుడిగా బిరుదు అందుకున్న రంగాచార్య 2015 జూన్ 8వ తేదీన కన్నుమూశారు. సాహిత్యంతో ఉద్యమాలు పుట్టవు…. ఉద్యమాలతోనే సాహిత్యం పుడుతుందన్న రంగాచార్యులు…. నిత్య చైతన్యశీలి.

- Advertisement -